9 June 2015

గ్రామీణ ప్రాంత నిరుపేద యువతీ యువకులకు ఉద్యోగాల కల్పన

* కార్యాచరణ సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వంహైదరాబాద్: గ్రామీణ ప్రాంత నిరుపేద యువతీ యువకులకు ఉద్యోగాల కల్పనపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాదికి 40 వేలమందికి వివిధ రకాల వృత్తి నైపుణ్యాలు కల్పించి, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర  గ్రామీణాభివృద్ధి శాఖ ప్రవేశపెట్టిన 'దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్- గ్రామీణ కౌశల్య యోజన' పథకం కింద కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ అధికారులు సుమారు రూ.150 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. దీనికి ప్రభుత్వం జూన్ 8న ఆమోదం తెలిపింది. ఈజీఎంఎం ద్వారా 40 వేలమందికి ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం మూడు దశల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. తొలివిడతలో 12,515 మందికి శిక్షణ ఇప్పించేందుకు రూ.30.04 కోట్లు మంజూరు చేసింది. శిక్షణతో పాటు ఉద్యోగాలను కల్పించే బాధ్యతను ఎంపిక చేసిన ఏజెన్సీలకు అప్పగించింది. ఈ మేరకు వాటితో అవగాహన కుదుర్చుకోవాలని ఈజీఎంఎం అధికారులకు సర్కారు సూచించింది.  గ్రామ సమాఖ్యల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వం గతేడాది నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో సుమారు 15 లక్షలమంది పేద వర్గాలకు చెందిన యువకులు ఉన్నట్లు తేలింది. వీరిలో అత్యంత నిరుపేద కుటుంబాలకు చెందిన వారు సుమారు 2.5 లక్షల మంది ఉన్నట్లు అంచనా. రానున్న నాలుగేళ్లలో వీరందరికీ అవసరమైన శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని ఈజీఎంఎం సీఈవో మురళి వెల్లడించారు.

No comments:

Post a Comment